ధర్మసాగర్ /ఫిబ్రవరి 4 హనుమకొండ జిల్లా (జర్నలిస్ట్ వార్త):
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని స్వయంకృషి కాలనీలో దాతల సహకారంతో రోడ్డు నిర్మాణం చేపడుతుండగా, కాలనీవాసులు గ్రామపంచాయతీ ద్వారా రోడ్డు ఏర్పాటు చేయాలని సంతకాలతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు. ఈ మేరకు గ్రామపంచాయతీ పాలకవర్గం రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో రోడ్డు వెడల్పుగా వేయవద్దని కొందరు వ్యక్తులు అడ్డుకోవడం సరికాదని కాలనీవాసులు, గ్రామపంచాయతీ పాలకవర్గం స్పష్టం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు దాతల సహకారంతో రోడ్డు నిర్మాణం జరుగుతుంటే అడ్డుకోవడం అన్యాయమని కాలనీవాసులు, గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ ఘటనపై బుధవారం గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి, వార్డు సభ్యులు స్వయంకృషి కాలనీలోని రోడ్డు ప్రాంతాన్ని పరిశీలించి కాలనీవాసులతో మాట్లాడారు. రోడ్డు నిర్మాణం వల్ల ఎవరికైనా ఇబ్బందులు ఉంటే గ్రామపంచాయతీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, ఎవరికీ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని వారు భరోసా ఇచ్చారు.