మల్లన్న భక్తుల తిప్పల బస్సుల కోసం తోపులాట.. క్యూలైన్లు లేక భక్తుల గోస

journalist vaartha
By -

జనగామ/ఫిబ్రవరి 15(జర్నలిస్ట్ వార్త): కొమురవెల్లి క్షేత్రానికి వెళ్లే భక్తులతో జనగామ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగగా, దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు లేకపోవడంతో బస్టాండ్ ఆవరణ రణరంగాన్ని తలపించింది. బస్సు ఎక్కేందుకు కనీస క్యూలైన్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ బస్సుల మీద పడుతున్నారు. రద్దీని నియంత్రించడంలో ఆర్టీసీ సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని భక్తులు మండిపడుతున్నారు. క్యూలైన్ల నిర్వహణను గాలికి వదిలేశారని ఆరోపిస్తున్నారు. బస్సు రాగానే సీట్ల కోసం మహిళలు, వృద్ధులు సైతం ప్రాణాలకు తెగించి కిటికీల గుండా లోపలికి చొరబడుతున్నారు. గంటల తరబడి ఎండలో నిలబడటంతో చిన్న పిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు.