ధర్మసాగర్/హనుమకొండ, ఫిబ్రవరి 8( జర్నలిస్ట్ వార్త): విద్యను పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా అనుభవాత్మకంగా అందించాలనే లక్ష్యంతో ధర్మసాగర్ జెడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాల, ఎంపీపీఎస్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు కలిసి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన నాగార్జునసాగర్–నాగార్జునకొండలకు విద్యా పర్యటన నిర్వహించారు.నాగార్జునకొండ పురావస్తు సంగ్రహాలయంలోని శాసనాలు, శిల్పాలు, పురాతన అవశేషాలను విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించారు. దీని ద్వారా బౌద్ధ యుగం, అప్పటి సామాజిక జీవనం, సాంస్కృతిక వైభవంపై స్పష్టమైన అవగాహన పొందారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలకు ఇది ప్రత్యక్ష అనుసంధానంగా నిలిచిందని ఉపాధ్యాయులు తెలిపారు.నాగార్జునసాగర్ ఆనకట్ట సందర్శనతో జలవనరుల నిర్వహణ, నదీ ప్రాజెక్టుల ప్రాధాన్యత, వ్యవసాయ మరియు ఆర్థిక అభివృద్ధిలో వాటి పాత్రపై విద్యార్థులకు అవగాహన పెరిగింది. లాంచ్ ప్రయాణం ద్వారా కృష్ణా నది పరిసరాల ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పర్యావరణ సమతుల్యతపై అవగాహన పెంపొందించుకున్నారు.
విద్యతో పాటు సామాజిక అనుబంధం, సాంస్కృతిక వ్యక్తీకరణకు కూడా ఈ పర్యటన దోహదపడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాటలు పాడటం, నృత్యాల్లో పాల్గొనడంతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. బుద్ధవనంలో నిర్వహించిన సంయుక్త భోజనం ఐక్యత, సహకార భావాలను మరింత బలపరిచింది. ఈ విద్యా పర్యటనను ప్రధానోపాధ్యాయులు కే.బి. ధర్మప్రకాశ్ నేతృత్వంలో పర్యటన సమన్వయకర్త రాజమ్మ సమర్థవంతంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు శ కవితాదేవి, సురేష్, కిరణ్మయీ, ప్రసన్న, సురేష్ సంపూర్ణ సహకారం అందించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ మమతతో పాటు ఉపసిబ్బంది అజ్మీరి బేగం, పూలమ్మ, శ్యామల, రాధలు కీలక పాత్ర పోషించారు. మొత్తం 52 మంది విద్యార్థులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.